Pages

Sunday, July 10, 2011

అనంత ‘కోటి’ పద్మనాభుడు

ఈ దేవాలయాన్ని చూస్తే.. ఓ మామూలు దేవాలయంగా కనపడుతుంది. ఆలయ గోపురానికి, ప్రాకారాలు కనీసం వెల్ల వేయకుండా ఉంటుంది. కేరళలో ఎంతో ప్రసిద్ధిగాంచినప్పటికీ.. ఇతర ప్రాంతాలకు ఆ దేవాలయం కొత్తే అని చెప్పాలి. అయితే ఆ దేవాలయం ఇప్పుడు ఓ నగల గని.. ఆభరణాల ఖజానా.. బంగారు కొండ.. నవరత్నాల నిలయం.. బంగారు ఆభరణాలు.. వజ్ర ఖచిత కిరీటాలు.. నవరత్నాలు పొదిగిన నగలు.. మరకత మాణిక్యాలు.. వజ్ర వెఢూర్యాలు.. రత్నాలు.. ఒకటా.. రెండా..!? ఒకదాని తర్వాత మరొకటి ఊహాతీతంగా బయట పడుతూనే ఉన్నాయి. దీంతో ఆ దేవాలయం ప్రపం చంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా వినుతికెక్కింది. ఆ దేవాలయమే.. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం.

devudis 
లక్ష కోట్ల సంపద వెలుగుచూడడంతో.. పద్మనాభుడు ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తాడు. విష్ణురూపమైన ఆ స్వామి.. లక్ష్మీ కటాక్షంతో తులతూగు తున్నాడు. ఎంతలా అంటే.. శిరిడీ సాయినాథున్ని.. స్వర్ణదేవాలయ వెనక్కి నె ట్టేంతగా. ప్రపంచంలోనే ధనవంతుడైన కలియుగ దైవం వడ్డీకాసులవాడిని సైతం వెనక్కి నెట్టేంతంగా ఒకేసారి కోట్లకు పడగలెత్తాడు. ఇదీ.. కేరళ రాజ ధాని తరువనంతపురంలో కొలువై ఉన్న అనంత పద్మనాభుడి వైభవం. అనం త పద్మనాభ స్వామి దేవాలయం... ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల దేవాలయ నేలమాళిగల్లో లక్ష కోట్ల సంపద వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాల యం. దీంతో దశాబ్దాల తరబడి.. సంపన్న దేవాలయాలుగా వెలుగొందుతు న్న తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడీ సాయిబాబా సంస్థాన్‌, అమృత్‌సర్‌ లోని స్వర్ణదేవాలయాలు.. తమ అగ్రస్థానాలను చేజార్చుకున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌తో సమానం...
coinss 
పదిహేను రోజుల క్రిందట తొలిసారిగా వెలుగులోకి వచ్చిన అనతంత పద్మ నాభుడి సంపద.. వారం రోజుల పాటు లెక్కించగా.. లక్ష కోట్లకు చేరుకుం ది. ఈ నేపథ్యంలో.. ఈ ధనాన్ని ఏం చేస్తారన్న సందేహాలు ప్రజల్లో పొడసూ పడం సహజం. ఏకంగా మన రాష్ట్ర బడ్జెట్‌కు సమానమైన ఈ సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదరిక నిర్మూలనకు ఉపయోగించాలని కొం దరంటే.. ప్రభుత్వ హయాంలోకి ఈ సంపద వెళితే ఎక్కడికక్కడ దోచుకు తింటారనీ.. ఈ సంపద నంతా ఆలయ పాలకుల ఆధీనంలోనే ఉంచి ఆలయ అభివృద్ధికి ఉపయోగించాలని కొందరంటున్నా రు. కేంద్ర ప్రభుత్వ విద్యా బడ్జెట్‌కు సమానమైన ఈ సంపదను విద్యాభివృ ద్ధికి ఉపయోగించాలని మరికొందరు అంటున్నారు. హిస్టరీ కాంగ్రెస్‌ అధ్యక్ష డు నారాయణ రావు మాత్రం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుం డా.. కొన్నాళ్లపాటు ఈ సంపదనంతా రాజవంశీకులు విధివిధానాలకనుగు ణంగానే ఈ మొత్తాన్ని ఆలయ సంపదగానే పరిగణంచాలని అన్నాడు.

ఎక్కడిదీ సంపద...
Padmanabhaswamy_temple 
శతాబ్దాల పాటు తాళం వేసిన ఉన్న దేవాలయ నేలమాళిగలను తెరిచి చూ డాలన్న సుప్రీం కోర్టు ఆదేశం మేరకు.. ఆ పని చేసిన ఆలయ సిబ్బందికి కళ్ళు బైర్లు కమ్మాయి. తీస్తున్న కొద్దీ అనంత ధనకనకరాశులు బయటపడ్డా యి. అరుదైన వజ్రాలు, పురాతన నాణేలు, కిరీటాలు, పచ్చలు ఎన్నో రాశుల కొద్ది బయటపడ్డాయి. దీంతో సుప్రసిద్ధ దేవాలయంగా వెలుగొందుతున్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒక్కసారిగా.. ప్రపంచ ఖ్యాతి పొందిం ది. సుప్రీం కోర్టు ప్రత్యేకంగా నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీ గత నెల 27 నుండి వారం రోజుల పాటు లెక్కించి పద్మనాభుడి సంపదను లక్ష కోట్లుగా నిర్ధారించారు. వీటికున్న పురాతత్వ విలువను కూడా పరిగణలో కి తీసుకుంటే.. లక్ష కోట్లకు పదిరెట్లు పెరిగే అవకాశం ఉంది.

ఇక్కడికి ఎలా చేరింది...
temples 
భారత్‌లో బ్రిటీష్‌ వారు విజృంభిస్తున్న రోజులవి. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారీ వరకు అన్ని సంస్థానాలను.. నయానో బయానో మెప్పించి.. లేదంటే దాడి చేసి.. స్వాధీనపరుచుకుంటున్న బ్రిటీషర్ల కన్ను ట్రావెన్‌కోర్‌ సంస్థానం పై పడింది. అయితే.. సంస్థానాన్ని బ్రిటీ ష్‌ వారికి ఇవ్వడానికి ససేమిరా అన్న మహారాజా మార్తాండ వర్మ.. బ్రిటీషర్లతో యుద్ధానికి దిగాడు. వీరోచితంగా పోరాడినప్పటికీ.. బ్రిటీష్‌ వారి ఆధునాత యుద్ధ విద్య ముందు తలవంచక తప్పలే దు. ఈ నేపథ్యంలో తాను ఓడిపోతే.. సామ్రాజ్య సంపదనంతా దోచుకెళ్తారని భావించి.. సుంకాల ద్వారా వచ్చిన సంపదనం తా.. తాము ఆరాధ్య దైవంగా భావించే.. అనంత పద్మనా భుడి చెంత భద్రపరిచాడని చెబుతారు. అలా శతాబ్దాల క్రితమే ఆ సంపద పద్మనాభుడి పాదాల చెంత చేరింది.

దేవాలయంలో అసలు ఏం జరిగింది...
అనంత పద్మనాభుడి ఆలయ గార్భాలయాల్లో గుప్త నిధులున్నాయని చాలా మంది చెబుతుండేవారు. అయితే.. రాళ్ళతో మూసి ఉంచిన గదుల్లో కొన్నిం టి తిరిచి దాదాపు 150 సంవత్సరాలవుతోంది. 1860 ప్రాంతంలో ఈ నేల మాళిగలను మూసివేశారు. 1950 లో వీటికి పకడ్బందీగా సీల్‌ కూడా వేశా రు. స్వాతంత్య్రానంతంరం కేరళలోని ఆలయాలన్నింటినీ ట్రావెన్‌కోర్‌ దేవాల య బోర్డులో విలీనం చేసినప్పటికీ.. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులు తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. ఆ కు టుంబానికి చెందిన చివరి రాజు చితిర తిరునాళ్‌ బలరామ వర్మను.. అప్పటి ప్రభుత్వం రాజప్రముఖ్‌ (గవర్నర్‌ హోదాతో సమాన హోదా) గా గుర్తించింది.

నేటికీ ట్రావెన్‌కోర్‌ రాజవంశానికి చెందిన కుటుంబ సభ్యులే ఆలయ ఆలనాపాలనా చూస్తూ.. ఆలయ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 89 ఏళ్ళ ఉత్తర్‌ దామ్‌ తిరునాళ్‌ మార్తాండ ఆలయ ట్రస్టీగా కొనసాగుతు న్నాడు. అయితే.. ఇటీవల ఆలయ సంపద అస్తవ్యస్తంగా ఉందని, దీనిని గాడిలో పెట్టాలని టి.పి.సుందర రాజన్‌ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీంతో సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల కమిటీని నియమించి.. ఆలయ ఆస్తులను లెక్కించాల్సిందిగా ఆదేశించింది. అదిగో అప్పుడు బయటపడింది అనంతుడి అంతులేని సంపద.

శ్రీవారిని సైతం వెనక్కి నెట్టి...
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన వడ్డీకాసుల వాడు శ తాబ్దాలుగా తాను సంపాదించి సంపద.. ఇప్పుడు పద్మనాభుడి సంపదలతో మూడోవంతు కూడా లేదు. అధికారికంగా.. టీటీడీ సంపద 32 వేల కోట్లు ఉంటుందని చెబుతున్నా.. భద్రతా కారణాల వల్ల టీటీడీ అసలు సంఖ్యను బ యటపెట్టడంలేదు. అయితే అనధికార లెక్కల ప్రకారం శ్రీనివాసుడి సంపద యాభైవేల కోట్లు ఉండవచ్చని అంచానా.. అయినా ఇది పద్మనాభుడి సంపద లో సగం మాత్రమే. ఇక రెండు మూడు స్థానాల్లో ఉన్న షిరిడీ సాయి సంస్థాన్‌, అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం పద్మనాభుడితో పోటీ పడలేక చేతులెత్తాశాయి.

నేలమాళిగల్లో ఏం దొరికాయి..
వారం రోజుల పాటు లెక్కించిన సందలో.. 2000 రకాల కంఠాభరణాలు, 35 కిలోల బంగారు విగ్రహాలు, 16 శతాబ్దం, శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి నాణేలు, ఈస్టిండియా కంపెనీ, నెపోలియన్‌ బోనాపార్టీ కాలాల నాటి నాణేలు సంచుల కొద్ది బయటపడ్డాయి. బంగారు గొలుసులు, బంగారు టెంకాలయలు, స్వర్ణ ఖంఖాలు ఇలా ఎంతో విలువైన వస్తువులెన్నో వెలుగు చూశాయి. నాణేలు భద్రపరిచిన సంచులు ఒక్కడి క్కడ పీలికలుగా మారి పోయినా.. నాణేలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి.

Thiruvanthapuram 
ట్రావెన్‌కోర్‌ రాజు లకు ఆ నాణేలు సుంకాల కింద వచ్చి ఉండవచ్చునని, భద్రతా కారణాల రీత్యా వారు వీటినక్కడ భద్రపరిచి ఉండవచ్చునని పురవాస్తు శాఖ అధికారు లు చెబుతున్నారు. వీటితో పాటు విజయనగర సామ్రాజ్యానకి చెందినవి మరియు ఐరోపాకు చెందిన నాణేలు కూడా ఇక్కడ లభించాయి. ఈ గదు లకు తాళాలు వేసిన తీరు కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఎంతో క్లిష్టమైన రీతిలో ఉన్న ఆ తాళాలను తీయడానికి ఒక్కో తాళానికి ఆరుగంటల సమ యం పట్టిందట. మొత్తం ఆరు గదుల్లో తనిఖీలు చేసిన అధికారులు మాత్ర చివరి గదిని ఇంకా తెరువలేదు. కేరళ దేవాదాయ శాఖామంత్రి వి.ఎస్‌. శివ కుమార్‌ మాట్లాడుతూ... ఈ సంపదంతా.. ఆలయానికే చెందుతుందని తెలిపారు. అయితే చివరి గది తెరిచే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసు కోలేదని ఆయన అన్నాడు.

అప్పు 80 వేల కోట్లు, ఆస్తి లక్ష కోట్లు..
కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయ సంపద విలువ లక్ష కోట్ల రూ పాయలకు మించింది. ఇది ప్రభుత్వ రుణం కన్నా ఎక్కువ. కేరళ ప్రభుత్వం అప్పులు రూ. 70 వేల 969 కోట్లు ఉన్నాయి. ఈ సంపద విలువ మరింత పెరగవచ్చుని భావిస్తున్నారు. ఆలయ నేలమాళిగల్లోంచి తవ్వుతున్న కొద్దీ సంపద వెలువడుతోంది. ఆ విలువ కేవలం ఊహా మాత్రమేనని, ప్రాచీన కళాఖండాల విలును కచ్చితంగా నిర్ణయించలేమని భారత చారిత్రక పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్‌ ఎంజిఎస్‌ నారాయణన్‌ అన్నారు. వాటి విలువ ను వెల్లడించడానికి సుప్రీంకోర్టు నిర్ణయించిన కమిటీ వెల్లడించడానికి నిరాకరిస్తోంది.

పూరీ జగన్నాథుడూ సంపన్నుడే...
TH-TEMPL గత ఫిబ్రవరి నెలలో జగన్నాథుడు కొలువై వున్న ప్రఖ్యాత పూరీ పుణ్యక్షేత్రంలో.. దాదాపు 90 కోట్ల విలువ చేసే 539 (సుమారు 18 టన్నులు) వెండి ఇటుకలు వెలుగుచూశాయి. ఈ ఏడాది పూరీ జగన్నాథ యాత్ర నేపథ్యం లో.. ఆలయంలో జరిగే దొంగతనాలను అరి కట్టేందుకు ఒడిశా పోలీసులు తనిఖీ నిర్వహిం చినప్పుడు ఈ వెండి ఇటుకలు బయపడ్డాయి. ఒక్కో ఇటుకు బరువు 40 నుండి 55 కిలోల వరకు ఉంటుంది.

చెక్క పెట్టల్లో భద్రపరిచిన ఈ ఇటుకలు.. పూరీ దేవాలయానికి.. 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమర్‌ మఠ్‌లో లభ్యమయ్యాయని.. పూరీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజయ్‌ కుమార్‌ అప్పట్లో వెల్ల డించారు. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో ఇద్దరు వ్యక్తులు రెండు వెండి ఇటుకలను దొం గిలించి అరెస్టైన నేపథ్యంలో.. ఒడిశా పోలీసు లు ఈ మఠంలో తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్‌లో ఒడిశాలోని డెంకనాల్‌ నగరంలో ఓ తాపీమేస్ర్తీ.. పది కిలోల విలువ చేసే రెండు వెండి ఇటుకలను అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని విచారించగా.. పూరీలోని ఎమర్‌ మఠం నుండి దొంగి లించినట్టు తెలిపాడు.

TPsunder-raj 
అతను మరో వ్యక్తి కలిసి కొంతకాలం క్రితం ఎమర్‌ మఠంలో మర మ్మత్తు పనులు చేశారు. వీరు పనులు నిర్వహి స్తున్న సమయంలో.. ఓ రహస్య గది పై పెచ్చు ఊడి కిందపడింది. దీంతో కింద ఉన చెక్క పెట్టెలు పగిలి.. కొన్ని వెండి ఇటుకలు బయట పడ్డాయి. వాటినుండి కొన్నింటిని దొంగిలించి న వ్యక్తి.. ఆ ఇటుకలను విక్రయిస్తూ.. పోలీసు లకు చిక్కాడు. అతను చెప్పిన వివరాల ప్రకా రం పోలీసులు అదే రోజు రాత్రి మఠానికి వెళ్లి గుప్త నిధులు ఉన్న ఆ రహస్య గదికి తాళం వేశారు. మరుసటి రోజు ఉదయం.. మెజిస్ట్రే ట్‌, ఉన్నతాధికారుల సమక్షంలో.. గది తాళా లు తెరిచి చెక్కపెట్టెల్లోని ఇటుకలన్నీ బయటికి తీశారు. ఉదయం నుండి సాయంత్ర వరకు జరిపిన సోదాల్లో సుమారు 18 టన్నులు వెం డి ఇటుకలు బయటపడ్డాయనీ, కొన్ని వందల ఏళ్ళ క్రితం నుండే ఈ నిధి ఇక్కడ ఉందని తెలుస్తోందని దేవాదాయ కమిషనర్‌ సంజయ్‌ కేసర్‌ స్వయి అన్నారు.

మఠంలో మరికొన్ని చోట్ల గుప్త నిధులు ఉన్నాయేమోనన్న కోణంలో పోలీసులు తనిఖీ లు కొనసాగించారు. ఇటుకలపై ఉన్న గుర్తుల ఆధారంగా.. అవి బ్రిటీష్‌ కాలం నాటివని తేలింది. అయితే మఠంలో ఇంకా ఎంత గుప్త నిధి దాగివుందో అనేదానిపై ఇంకా పూర్తి వివ రాలు బయటకు రాలేదని పోలీసులు తెలిపా రు. మఠాధిపతి రామానుజ నారాయణ దాస్‌ మాట్లాడుతూ.. మఠంలో గుప్తనిధులు ఉన్నా యని పెద్దలు చెబుతుండేవారని, అవి ఇన్నా ళ్ళకు బయటపడ్డాయని అన్నాడు.

సంపదంతా స్వామిదే: కేరళ సీఎం
కాగా... అనంత పద్మనాభ స్వామి దేవాల యంలో బయటపడిన సంపద అంతా ఆల యానికే ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ చెప్పారు. దాన్ని అక్కడే నిల్వ చేయనున్నట్లు ఆయన తెలిపారు. బయటకు వచ్చిన సంపదకు మతపరమైన, చారిత్రక ప్రత్యేకత ఉందని ఆయన అన్నారు.

దేవాలయ చరిత్ర...
పద్మనాభ స్వామి దేవస్థానానికి.. కొన్ని శతా బ్దాల చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలో.. ప్రసిద్ధిగాంచిన రాజవంశం.. ట్రావెన్‌కోర్‌ సం స్ధానాధీశుల ఆధీనంలో ఉంది. ఎత్తువీటి పిల్ల మ్మార్‌గా పేరుగాంచిన ఎనిమిది శక్తివంతమైన కుంటుంబాలకు చెందిన నాయర్‌లు ఆలయ ఆలనాపాలనా చూసేవారు. తరువాత ఈ ఆల యం ట్రావెన్‌కోర్‌ సంస్థాన ఆధ్యుడైన మహారా జా మార్తాండవర్మ చేతుల్లోకి వెళ్లింది. వీరి ఆధీ నంలో పద్మనాభ స్వామి ఆలయం ఎంతో వృద్ధిగాంచింది. ఈ దేవాలయానికి పెద్దయెత్తు న మార్పులు చేయించింది కూడా రాజా మార్తాండవర్మ హయాంలోనే.

TrivandrumAnanthaPad 
రాజామార్తాండ వర్మ.. తన ట్రావెన్‌కోర్‌ సంస్థానానికి పద్మనా భ స్వామిని కులదైవంగా ప్రకటించి సేవలం దించేవాడు. అంతేకాదు.. పద్మనాభ స్వామిని ట్రావెన్‌కోర్‌ సంస్థానాన్ని కాచే దైవంగా భావిం చేవాడు. ఈ నేపథ్యంలో.. తమకు తాము ‘పద్మనాభ దాస’ (పద్మనాభ స్వామి సేవకులు) గా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా.. పద్మనాభస్వామి ‘వాలంపిరి శంఖు’ను తమ సంస్థానానికి చిహ్నంగా చేసుకున్నాడు. ఇప్పటీ కీ ఇది కేరళ ప్రభుత్వ అధికారికి చిహ్నంగా కొనసాగుతుండడం గమనార్హం. ఇక్కడ ప్రతి యేటా రెండు పెద్ద ఉత్సవాలు అత్యంత వైభ వంగా జరుగుతాయి. ఉత్సవాల సందర్భం గా.. పద్మనాభస్వామి, నరసింహ స్వామి, కృష్ణుడి విగ్రహాలను ‘శంఖుముగం బీచ్‌’లో గరుడవాహనం పై ఊరేగిస్తారు. ఈ ఉత్సవాన్ని ఆరట్టు అని పిలుస్తారు. ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో తిరువనంతపురం లో సెలవు దినాలు గా పాటించండం విశేషం.

విష్ణుమూర్తి అవతా రమైన అనంత పద్మనాభుడు శేషశైయనం పై పవళించినట్టుగా ఇక్కడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని.. ఆయుర్వేద పదార్థాలైన కడు శక్కర యోగం తో తయారుచేశారు. శేషశ యనుడైన పద్మనాభుడి తల భాగం దక్షిణం వైపు.. తూర్పు ముఖంగా ఉంటుంది.ఈ దేవాలయం చరిత్ర గురించి ఇంకా లోతు గా పరిశీలిస్తే... 8వ శతాబ్దంలో తిరువనం తపురం ‘చిర సామ్రాజ్య’ ఏలుబడిలో ఉండేది. అల్వార్లు రచించిన పవిత్ర ‘దివ్య ప్రభంధ’ గ్రంథంలో ఈ దేవాలయ ప్రస్తావన ఉంది. గ్రంథంలో సూచించిన కేరళలోని 11 ‘దివ్య దేశా’లలో పద్మనాభస్వామి క్షేత్రం కూడా ఒక టి. అంతేకాకుండా.. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ పురాణాల్లో సైతం పద్మనాభుడి ప్రస్తావన ఉన్నట్టు చెబుతారు. 8వ శతాబ్దపు ప్రఖ్యాత కవి నమ్మళ్వార్‌ పద్మనాభుడిని స్తుతిస్తూ.. నాలుగు శ్లోకాలు, ఒక ఫలసృతి రచించాడు.

ఆలయ గోపురం...
ప్రస్తుత ఆలయ గోపురాన్ని 1566లో నిర్మిం చినట్టు చరిత్ర చెబుతోంది. ఈ గోపురం ఎత్తు వంద అడుగులు. దేవాలయం పక్కన పెద్ద కోనేరు ఉంటుంది. దీనిని ‘పద్మతీర్థం’ అంటా రు. ఈ దేవాలయం గ్రానైట్‌ పిల్లర్లతో చక్కని శిల్పకళానైపుణ్యంతో చెక్కబడి ఉంటుంది. 80 అడుగుల ఎతె్తైన ప్రకారం.. దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద మనకు గోచరిస్తుంది. గోపరం కింద ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ను నాటక శాల అంటారు. ఇందులో ఉత్సవాల (మీనం, తులం మాసాల్లో) సందర్భంగా కేరళ రాష్ట్ర నృత్యమైన కథాకళిని ప్రదర్శిస్తారు.

గర్భగుడి...
గర్భగుడిలో అనంత పద్మనాభుడి విగ్రహం.. ఆదిశేషుడిపై పవళించినట్లుగా ఉంటుంది. పద్మనాభుడు పైకి చూస్తూ.. తన ఎడమచేతి లో పద్మాన్ని పట్టుకొని ఉంటాడు. కాగా.. కుడి చేతివైపు శివుడు, శ్రీదేవి, భూదేవి లు కొలువై ఉంటారు. ఉదర భాగంలో ఉద్భవించిన పద్మంలో బ్రహ్మదేవుడు కొలువుదీరి ఉంటాడు. ఈ విగ్రహం 12 వేల శాలగ్రామాలతో మలచ బడి ఉంటుంది. ఈ శాలగ్రామాలను నేపాల్‌ లోని పవిత్ర నది గండకి నుండి తీసుకొచ్చిన ట్టుగా చెబుతారు. శాలగ్రామం పైన ఆయు ర్వేదానికి సంబంధించిన ‘కటుసర్కర యోగం’ ఉంటుంది.

Raja_Marthanda_Varma 
ఇది విగ్రాహాన్ని పురుగులు పట ్టకుండా కాపాడుతుంది. అయితే.. అభిషేకానికి మూల విగ్రహాన్ని ఉపయోగించరు. కేవలం పుష్పాలతో అలంకరించి పూజిస్తారు. అభిషే కం కోసం ప్రత్యేకించి విగ్రహాలుంటాయి. ఈ పుష్పాలను ప్రతిరోజూ నెమలి ఫించాలతో తొలగించి కొత్త పుష్పాలను అలంకరిస్తారు. విగ్రహం పైనుండి కటు సర్కర తొలగిపోకుం డా ఉండేందుకు నెమలి ఫించాలతో మాత్రమే శుభ్రం చేస్తారు. పద్మనాభ స్వామి కొలువై ఉన్న ప్లాట్‌ఫాంను ‘ఒట్టక్కల్‌ మండపం’ అనే ఏకశిలలో నిర్మించారు. పద్మనాభుడికి పూజ చేయాలంటే.. ఈ ఒట్టక్కల్‌ మండపం పైకి ఎక్కాల్సివుంటుంది. ఈ విగ్రహం మనకు మూడు ప్రధాన ద్వారాల గుండా దర్శనమిస్తుంది.

స్వామివారి కుడిచేతి దిగువననున్న శివలిం గం వైపు ఒక ద్వారం, బ్రహ్మ, శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్న దిశగా రెండో ద్వారం ఉంటుం ది. పద్మనాభుడి పాదాలవైపు మూడో ద్వారం ఉంటుంది. ఒకప్పుడు ట్రావెన్‌కోర్‌ రాజులు మాత్రమే ఒట్టక్కల్‌ మండపం పైకి చేరి స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ట్రావె న్‌కోర్‌ సంస్థానంలో రాజులను ‘పద్మనాభ దాసు’లుగా పిలిచేవారు. ట్రావెన్‌కోర్‌ను పరో క్షంగా పాలిస్తున్నది పద్మనాభుడే అని వారి నమ్మకం.

విశ్వవాప్తంగా ఉన్న 108 దివ్య దేశా ల్లో (విష్ణుమూర్తి క్షేత్రాలు) మూల విరాట్టు ఎక్కడైనా.. కూర్చుండి కానీ, నిలబడి గానీ, పవళించి గానీ ఉంటాడు. కానీ, ఇక్కడ ఆ 3 రూపాల్లో దర్శనం ఇవ్వడం అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రత్యేకత. గర్భ గుడి నుండి చూస్తే.. పద్మనాభుడు ఆదిశేషుడి పై పవళించి నట్టుగా ఉంటుంది. అలాగే ప్రధాన ద్వారం నుండి చూస్తే.. విగ్రహం నిలబడినట్టు ఉం టుంది. కాగా.. ఉత్సవమూర్తిగా ఉన్న మరో విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహాన్నే ఉత్సవాల్లో ఊరేగిస్తారు.

ప్రధాన మూర్తి అనంత పద్మనాభుడితో పాటు ఈ దేవాలయంలో నరసింహస్వామి, శ్రీకృష్ణు డు, అయ్యప్ప, గణపతి, ఆంజనేయుడు కూడా పూజలందుకుంటున్నారు. కాగా.. విశ్వక్సేన, శ్రీ గరుడు ఆలయ క్షేత్రపాలకులుగా పూజలం దుకుంటున్నారు. కొన్నేళ్ళ క్రితం వెలుగుచూసి న విషయం ఏమిటంటే.. కేవలం కటుసర్కర యోగంతోనే మలచబడి ఉందనుకున్న పద్మనా భస్వామి విగ్రహంలో బంగారం కూడా వాడిన ట్టు కనుగొన్నారు. ముఖం, ఉదర భాగం మిన హా మొత్తం బంగారంతో చేసినట్టు తెలిసింది.

పద్మనాభుడి అవతారం...
పద్మనాభుడికి సంబంధించి అనేక కథలు వా డుకలో ఉన్నాయి. ఒకప్పుడు దివాకర ముని అనే ముని శ్రీకృష్ణుడి దర్శనం కోసం తపస్సు చేశాడట. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక బాలుడి రూపంలో ఆ మునికి దర్శనమిచ్చాడట. ఆ బా లుడు పూజకోసం ఉంచిన శాలిగ్రామాన్ని తి న్నాడట. దీంతో ఆగ్రహించిన దివాకర ముని బాలుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. పరుగుపరున వెళ్లి ఓ చెట్టు వెనకాల దాక్కున్నా డట. వెంటనే ఆ వృక్షం కుప్పకూలి విష్ణుమూ ర్తి అవతారంగా మారి అనంత శయన రూపం లో మునికి దర్శనమిచ్చిందట. అయితే ఊహించనంత ఎత్తుల స్వామి దర్శనమివ్వడం తో.. ఆశ్చర్యపోయిన ముని.. స్వామివారి భారీ కాయాన్ని తగ్గించని వేడుకున్నాడట.

దాంతో చిన్న రూపంలో దర్శనమిచ్చి.. తనను మూడు ద్వారాల గుండా పూజించాలని మునిని ఆదే శించాడట. ఆ మూడు ద్వారాల ద్వారానే ఇప్ప టికీ అనంత పద్మనాభ స్వామి భక్తులకు దర్శన మిస్తున్నాడు. మొదటి ద్వారంలో శివుడు, రెం డో ద్వారంలో బ్రహ్మ, మూడో ద్వారం ద్వారా విష్ణుమూర్తి పాదాలు దర్శనమివ్వడం విశేషం. ఒకానొకప్పుడు పద్మనాభ స్వామి దేవాలయం లో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. దాం తో విష్ణు రూపంగా మునికి దర్శనమిచ్చిన వృ క్షం కాలిపోయింది. అప్పటి రాజుపై పద్మనాభు డి ఆగ్రహంగా ఈ సంఘటనను వర్ణిస్తారు.
http://www.keralatourism.org/images/event/aaratu145.jpg
ఏడు పరుశురామ క్షేత్రాల్లో అనంత పద్మనాభ దేవాలయం కూడా ఒకటని విశ్వసిస్తారు. అం తేకాకుండా.. స్కంద, పద్మ పురాణాల్లో కూడా పద్మనాభుడి ప్రస్తావన ఉందని చెబుతారు. దీనికి సంబంధించి.. దళితులైన పులయ వర్గా నికి చెంది న ఇద్దరు వ్యక్తులకు విష్ణుమూర్తి బా లుని రూపంలో దర్శనమిచ్చాడట. అప్పుడు వారి చేతిలో ఉన అన్నాన్ని విష్ణుమూర్తి తీసు కొని ఆరగించాడట. అప్పుడు వారిలో ఒకతను (ఈ కథలో కూడా ఇతడిని దివాకర మునిగా భావిస్తారు) బాలుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఒక మామిడిపండును కొబ్బరి చిప్పలో ప్రసాదంగా పెట్టి పూజిస్తాడట. ఇప్ప టికి కూడా పద్మనాభస్వామి ఆలయంలో.. బియ్యంతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని కొబ్బ రిచిప్పలో పెట్టి స్వామికి నివేదించడం ఆనవాయితీగా వస్తుంది.

No comments:

Post a Comment