Pages

Thursday, August 26, 2010

వారు నా కంటే అందగత్తెలు - జయసుధ

ఇంక ఈర్ష్య, పోటీ ఎందుకు?
ఏఎన్నార్‌తోనే సౌలభ్యంగా ఉండేది
జగన్ వెంటే ఉంటా.. జీసస్‌ను చూశా...
-    జయసుధ
సినీ వినీలాకాశంలో ఆమె సహజనటి... ఇప్పు డు రాజకీయాల్లోకి వచ్చాక ఆ స్థాయిలో నటించలేకపోతున్నానని చెబుతున్నారు. ఇక్కడ అంతకంటే సహజ నటులున్నారని అంటున్నారు. తాను ఏదీ ప్రణాళిక ప్రకారం చేయలేదని, నటిగా అయినా, ఇప్పుడు ఎమ్మెల్యేగా మారినా అన్నీ అనుకోకుండా జరిగినవేనని పేర్కొన్నారు. తనకు టెన్నిస్ ఆడాలనే కోరిక మాత్రం ఇప్పటి దాకా తీరలేదంటున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నటి జయసుధ ...


సినీ, రాజకీయ జీవితాల మధ్య తేడా ఎలా ఉంది?
రాజకీయాల్లో ఇంకా ఇమడలేదు. ప్రతి రోజూ ఏదో ఒక విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. కొన్ని రాజకీయ చిత్రాల్లో చూసినప్పుడు నిజంగా అలా ఉంటుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదా పు అలాగే ఉంది. అంత మెలో డ్రామా కాకపోయినా దాదాపు 75% అలాగే ఉంది. సినిమాల్లో నటించేంత తేలిక కాదంటే... రాజకీయాలను అలా మార్చేశా రు. మన చేతిలో ఏమీ లేదు. త ప్పు మనది కాకపోయినా మన ల్నే అడుగుతారు. అయితే, ప్రజ లు ఎన్నుకున్నందున వాటిని ఎ దుర్కొనేందుకు సిద్ధపడాల్సిందే.


క్రైస్తవ మతం ఎందుకు తీసుకున్నారు?
1985లో బ్యాంకాక్‌లో ప్రమాదానికి గురైనప్పుడు జీసస్‌ను తలచుకున్నాను. అప్పటి నుంచి అలా నమ్మకం ఏర్పడింది. ఏసును అప్పుడు నేను చూశాను. ఏసుక్రీస్తుతో మనసులో మాట్లాడుతూనే ఉంటాను. 2001లో మతం పుచ్చుకున్నాను.


రాజకీయాల్లో మీకంటే సహజ నటులు తారసపడి ఉంటారు?
అబ్బో చాలామంది ఉన్నారండీ. చాలా సన్నివేశాల్లో నేను అవాక్కయిపోయాను కూడా. మన దగ్గర ఒకలా మాట్లాడి, వేరే చోట ఇంకోలా మాట్లాడటం... ఇది రాజకీయ సాంప్రదాయం అనుకోవాల్సిందే. మంత్రిగా అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పలేదు. ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతే రాజీనామా చేస్తానని చెప్పాను. అది పత్రికల్లో మరోలా వచ్చింది.


ఎమ్మెల్యేగా కాకుండా జయసుధగా గడచిన పది నెలల పరిణామాలు ఎలా అనిపిస్తున్నాయి?
మొదటి నుంచి చూస్తున్నారు కదా.. జగన్‌కు మేం మద్దతు పలకడం. ఇప్పుడు కూడా దాంట్లో మార్పు లేదు. జయసుధగా ఉండటం ముఖ్యం.. రాజకీయాలు కాదు. వైఎస్ తీసుకొస్తేనే వచ్చాను. పార్టీ నుంచి జగన్ వెళ్లిపోతే ఆయనతోనే ఉంటాను.


జయప్రదతో మీ పోటీ ఎలా ఉండేది?
జయప్రద, శ్రీదేవిలా అందంగా ఉండాలని కోరుకోలేదు. కథ చెప్పేటప్పుడు మాత్రం ఇద్దరు హీరోయిన్లుంటే నా క్యారెక్టర్ చనిపోవాలని పట్టుబట్టే దాన్ని. అందరం స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. నాకంటే వాళ్లు అందంగా ఉంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈర్ష్య? పద్మశ్రీ అవార్డు సైఫ్ అలీఖాన్‌కు ఇచ్చారు కదా... నేను ఇప్పుడు ప్రయత్నించవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందనిపించుకోవడం ఇష్టం లేదు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లలో ఎవరితో సౌలభ్యంగా ఉండేది?

నాగేశ్వరరావు గారితోనే. ఆయన చాలా సరదాగా ఉంటారు. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. రామారావు గారి దగ్గరకొచ్చే సరికి అంతా భయపెట్టేసేవారు. అలాంటిది ఆయనకు క్రికెట్ పిచ్చి పట్టించాను. మన హీరోలతో ఎప్పుడు ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇక్కడి హీరోలు చాలా మంచివారు. కమల్, నన్ను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు. ఎక్కువ చిత్రాల్లో చేశాం. ఆ తర్వాత అంతా వదిలేశారు. రాజకీయాల కోసం సినిమాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. క్రీడలంటే నాకు ఇష్టం. నేను కోరుకోకుండానే చాలా జరిగాయి. టెన్నిస్ ఆడాలని ఉంది. కానీ, ఇప్పుడది కుదరదేమో..?!


మూడు దశాబ్దాలు తెలుగు రాకుం డా ఎలా రాణించగలిగారు?
నేర్పించడానికి ప్రయత్నించారు గానీ, రాలేదు. ఆ రోజుల్లో టీవీలు లేకపోవడంతో బతికిపోయాను. లేకపోతే నా గురించి చాలా తెలిసిపోయేది. డైలాగులు విని చెప్పడం అలవాటైపోయిందంతే... జ్యోతి చిత్రం తర్వాత వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. సినిమాల్లో కూడా ముందు నాకు ఆసక్తి లేదు. మంచి పాత్రలు రావడం నా అదృష్టం. రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది.

Wednesday, August 25, 2010

ఒకటే జననం... ఒకటే మరణం - జయహో.. విజయగాధలు: పద్ధతులు - 1

అసాధ్యాలంటూ ఏమీ ఉండవేమో, స్ఫూర్తితో కొన్ని పద్ధతులను అవలంబిస్తే...

*** మనసుంటే మార్గముంటుంది; పర్‌ఫెక్ట్ చదువు, పర్‌ఫెక్ట్ ఉద్యోగం అవసరం లేదని నిరూపించాడు నోబెల్ బహుమతి విజేత సర్ సి.వి.రామన్

*** కలలకు గమ్యాలకు ఉన్న శక్తి సామర్థ్యాలేమిటో ప్రపంచానికి చాటిచెప్పిన మరో విశిష్ట భారతీయుడు; మన దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా దారి మళ్ళించిన విజేత - ఎం.ఎస్.స్వామినాథన్.

*** విల్మా రుడాల్ఫ్
అమెరికన్ వనిత. నల్లజాతికి చెందినది.
1940లో పుట్టిన ఆమెకు సంవత్సరం తిరిగేలోగా పోలియో సోకింది.
డాక్టర్లు ఇక ఆమె నడవలేదని తేల్చి చెప్పారు.
ఇరవై ఏళ్ళ తర్వాత 1960లో జరిగిన ఒలంపిక్స్‌లో విల్మా రుడాల్ఫ్ మూడు గోల్డ్ మెడల్సు గెలుచుకుంది. వాటిలో రెండు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి.
ఇది కల కాదు.
కథ కాదు
యాభై ఏళ్ళ క్రితం జరిగిన చరిత్రలోని ఒక పుట.
ఇది చదివాక అసాధ్యాలు అంటూ ఏవైనా ఉంటాయని మీరింకా భావిస్తూ ఉంటే, తీరిగ్గా కూర్చొని పునరాలోచన చేయండి

*** నేనెవర్ని?
నాలో దాగి ఉన్న ప్రజ్ఞ ఏమిటి?
ఏ పనిలో నేను నిష్ణాతుణ్ణి??
ఏ పని నన్ను ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది??
స్వశక్తిపై నమ్మకాన్ని, ఎన్నుకొన్న రంగంలో అపారమైన కృషి చేసి, నిష్ణాతుడిగా మారి దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు గడించిన కర్సన్‌బాయ్ పటేల్ సృష్టి 'నిర్మా' వాషింగ్ పౌడర్. ఆయన జీవిత గాథ, విజయాలు మనందరినీ ఉత్తేజపరిచేవే!
మనందరికీ మార్గదర్శకాలే!

*** ఈ విజేతలందరూ సామాన్యులే
ప్రేరణే వారి బలం. పద్ధతులు వారి ఆయుధాలు

*** రే క్రాక్
వయస్సు: 52
అమెరికన్
డయాబిటీస్ ఉంది.
ఆ్రర్దయిటిస్ కూడా ఉంది
గాల్ బ్లేడర్ తీసేసారు.
థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం కూడా తీసేసారు.
"అయినప్పటికి నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది''.
రే క్రాక్ అన్నమాటలివి.
అన్నమాటలే కాదు. చేసి నిరూపించాడు తనకీ, యావత్ ప్రపంచానికి.
నేటి మెక్‌డొనాల్డ్స్ సంస్థ నిర్మాణంలో మూలస్థంభం లాంటి వ్యక్తి ఈ రేక్రాక్ మహాశయుడే.
ఈ ప్రస్థానం మొదలైంది ఆయన 52వ ఏట. రకరకాల ఆరోగ్య సమస్యల వలయంలో ఉన్నప్పటికీ రే క్రాక్ తన గమ్యాలను వీడలేదు. అనుకున్నది సాధించాడు.

*** ఇలా ఎన్నో గాథలు. అన్నీ స్ఫూర్తినిచ్చేవే. మనల్ని కార్మోన్ముఖులుగా మార్చేవే.
రాబోయే వారాల్లో వీరి గురించి, ఇంకా పలువురి గురించి వివరంగా ముచ్చటించుకుందాం.
విజయానికి మార్గాలేవో మనమూ కనుగొందాం!
ఈ నా రచనకి మూలకారణమైన ప్రస్థానానికి నాంది పలికిన రోజు నాకింకా ఎంతో స్పష్టంగా గుర్తుంది.
31 అక్టోబర్ 1968
ఆ రోజు రాత్రి చేతిలో ఒక పాత ఇనప్పెట్టె, అందులో రెండు మూడు జతల బట్టలు, జేబులో నూట యాభై రూపాయలు, గుండెల్లో భయం, మనస్సులో వేయి కోరికలతో హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌లో రాత్రి 7.55కి బయల్దేరాల్సిన బాంబే ఎక్స్‌ప్రెస్‌లో ఒక థర్డ్‌క్లాస్ డబ్బా ఎక్కాను. అన్నీ తెలియని ముఖాలు. ఊహకందని భవిష్యత్తు.
29 నవంబరు 2009న తిరిగి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ నివాస మేర్పరచుకోవటానికని.
నలభై ఒక్క సంవత్సరాలు.
ఆ పైన ఇరవై ఎనిమిది రోజులు.
జీవితంలోని ముఖ్య భాగమంతా అహ్మదాబాద్‌లోనే గడచిపోయింది.
నేను అహ్మదాబాద్‌లో అడుగు పెట్టినప్పటి పరిస్థితులకి, తిరిగి హైదరాబాద్ రావటానికి వీడ్కోలు చెప్పిన నాటికి ఒక గొప్ప తేడా ఉంది.
ఆనాడు, తమ ప్రకటనల కోసం గుజరాత్‌లోని పలు వ్యాపార సంస్థలు బాంబేలోని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలకు ఆ బాధ్యతలను అప్పచెప్పుతుండే వారు.
1980 దశకంలో అది పూర్తిగా ఆగిపోయింది. అహ్మదాబాదులోని ముద్రా స్థాపనతో.
1990 దశకానికల్లా దేశంలోని నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా అడ్వర్‌టైజింగ్ రంగంలో ఉన్నత విద్య నభ్యసించటానికి విద్యార్థులు అహ్మదాబాద్‌కి రావటం మొదలుపెట్టారు. మైకా స్థాపనతో (మైకా: ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాదు) నేడు ఇది అంతర్జాతీయంగా పేరుపొందిన విద్యా సంస్థ.
ఎలా జరిగాయి ఈ అద్భుతాలన్నీ..
-ఎజి కృష్ణమూర్తి

ఇష్టం కనిపెట్టడమే కష్టం... జయహో.. విజయగాధలు: పద్ధతులు-2

ఇష్టమైన పనిని మనందరం కష్టపడి చేస్తాం అని మనందరికి తెలుసు.
ఆ ఇష్టమైన పనేదో మనకెప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది ??
కొంతమందికి తల్లిదండ్రులు స్ఫూర్తినిచ్చి, వారి వృత్తే పిల్లలకు ఇష్టమైన వృత్తిగా మారేలా చూస్తారు. మనలో చాలా మందికి రోల్ మోడల్స్ మన తల్లిదండ్రులే కదా.
కొంతమంది దురదృష్టవంతులకి ఇది వర్తించకపోవచ్చు. తల్లిదండ్రులు నేరస్తులయితేనో, లంచగొండులయితేనో..
పైన ఉదహరించుకొన్న కోవకి చెందిన వారు - డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు తదితరులు.
వీరికి వంశపారపర్యంగా వస్తున్న కుటుంబ వృత్తి వ్యాపారాలు ఆదర్శప్రాయంగా, ఆచరణీయంగా మారి, ఎంచుకున్న వృత్తి ఇష్టపడే వృత్తి ఒకటిగానే ఉండిపోతాయి. వీరికి ఏ చిక్కూ లేదు.
తండ్రిదో ఉద్యోగం, పిల్లలవి వేరువేరు...
మా నాన్న గారు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. మా అన్నయ్యా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోనే. చిన్నతనంలోనే మా అన్నయ్యకి నాన్న గారి వృత్తి మీద అభిమానంవల్లో లేక మా నాన్న గారి ప్రోద్భలంవల్లో ఆ రంగంలో చదువుకొని ఉద్యోగస్తుడయ్యాడు. ఆ రంగంలోనే రిటైర్ అయ్యాడు. తనకు ఆ రంగమంటే అసహ్యమని మా అన్నయ్య చెప్పగా నేనెన్నడూ వినలేదు.

ఇక నా విషయానికొస్తే, నా కిష్టమైన రంగమేంటో తెల్సుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా ప్రయోగాలు చేశాను. విద్యార్థిగా కనీసం ఇంజనీరింగ్ చదువుకోవాలనే గాఢమైన కోరికుండేది. కనీసం అని ఎందుకన్నానంటే, అసలైన కల డాక్టర్ కావాలని. నిజానికి ఆ రోజుల్లో అంతే 1950 దశకం నుంచి 1990 దశకం దాకా ప్రతి వాడికి డాక్టరో, ఇంజనీరో కావాలనే కోరిక తప్ప మరేది ఉండేది కాదేమో. నేటిలాగా పలు రంగాలు అభివృద్ధి చెందలేదు. పరిమితమైన జీవితాలు - ఇంకా పరిమితమైన చదువులు. ఇంకా ఇంకా పరిమితమైన అవకాశాలు. ఈ అవకాశాలు అదృష్టవంతులకు మాత్రమే లభ్యమవుతాయన్న ఒక బలమైన నమ్మకం కేవలం నాకే కాదు, ఆ నాటి సమాజంలో గాఢంగా పాతుకుపోయిందేమోననిపిస్తుంది.

"పెట్టి పుట్టాలి''
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా''
ఇలాంటి సామెతలు తరచుగా వింటుండే వాణ్ణి. ముఖ్యంగా మా అమ్మ ద్వారా.
బీదరికం
తరతరాలుగా వస్తున్న బీదరికం కాదు.
"మా నాన్న గారు పుట్టినపుడు 1901లో వారిది గుంటూరు జిల్లాలోనే ఒక సంపన్న కుటుంబం''.
'బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్' అంటామే - వాడికేమయ్యా, ఆగర్భ శ్రీమంతుడనో లేక నోట్లో బంగారు చెంచాతో పుట్టాడయ్యా అనో అంటామే - ఆ కోవకి చెందిన వారు మా నాన్న గారు.

పురిట్లోనే తల్లిని కోల్పోయారు మా నాన్నగారు. కొన్నేళ్ల తర్వాత భోగభాగ్యాలు కూడా, ఎందుకయ్యా అంటే, మా తాత గారు ఆనాటి సమాజంలోని పదుగురిలా అబద్దం చెప్పని సీదాసాదా వ్యాపారస్థుడు. పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారం. లక్షల్లో స్టాక్ కొని గిడ్డంగుల్లో నింపారు. సడన్‌గా రేట్లు పడిపొయ్యాయి. బాకీలు పెరిగాయి. కోర్టు కేసులు. ఒక్క అబద్దం చెబితే యావదాస్థి నిలిచేది. ఊహు.. ఆ మహానుభావుడు నిజం చెప్పాడు కోర్టులో యావదాస్థి తనదేనని.. తనది కాదు, తమ్ముడిదని చెప్పుంటే ఆస్తి జప్తు జరిగేది కాదు.
మాటే ప్రాణంగా భావిస్తున్న రోజులవి. విలువలకి సర్వం కోల్పోవటానికవి సిద్దమయిన రోజులవి.

మా తాత గారు అబద్దం చెప్పలేదు. ఆస్థి నిలువలేదు.
మా నాన్న గారి నోట్లోని బంగారు చెంచా సడన్‌గా సత్తు
చెంచాగా మారిపోయింది.
జీవన పోరాటం మొదలైంది. చిన్న ఉద్యోగం.
ఆనాటి అందరి లాగే పెద్ద కుటుంబం. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. నాది రెండో నంబరు.
పుట్టింది వినుకొండలోనైనా నా చిన్ననాటి జ్ఞాపకాలన్ని తెనాలి, బాపట్ల లోనివే. తెనాలిలోని మారీస్ పేటలో ఉండేవాళ్ళం. పూరింట్లోని ఒక భాగం అద్దెకు తీసుకుని అందులో ఉండేవాళ్లం.
మిగతా అమ్మల సంగతి నాకు తెలీదు కాని, మా అమ్మ అంత మంచి అమ్మ, కష్టపడే అమ్మ వేరెవ్వరూ ఏ లోకంలోనూ ఉండరు.

ఐదుగురు పిల్లలు... వీరు బతికిన సంతానం. పోయిన వారు కాని తెల్సినంత వరకు మరో ఇద్దరు. అందరి కన్నా పెద్దదైన అక్క, అందరి కన్నా చిన్నదైన చెల్లెలు.
ఇంట్లో బీదరికం.
ఎడంపక్కన మేడ. చౌదరి గారు ఉంటుండేవారు. ఆ రోజుల్లో మేడ ఉందంటే భాగ్యవంతుడి కింద లెక్కే కదా.
కుడి పక్కన డాబా ఇల్లు. అందులో రోజు నాకు దర్శనమిస్తూ, నా ఈర్ష్యకు గురైన ఒక మధ్య వయస్కుడు.
ఆరేడు ఏళ్లు ఉంటాయామో నాకు అప్పుడు.
రోజు ఉదయం స్కూలుకి వెళ్లేటపుడు ఈ పెద్ద మనిషి ఎంచక్కా ఒక పడక కుర్చీలో హాయిగా పడుకుని, చేతిలో పేపరు, పక్కన టేబులు మీద పాడుతున్న రేడియోతో దర్శనమిచ్చేవాడు.

ఇవన్నీ మాకు లేవు.
డాబా లేదు.
రేడియో లేదు.
పూరిల్లు, కరెంటు లేదు.
ఆహా ఈయన గారిది ఏమి అదృష్టమనుకుంటూ రోజూ ఈర్ష్యకు గురయ్యేవాడిని. నేను ఏనాటి కైనా ఈ పెద్ద మనిషిలాగా ఓ మిద్దె, ఓ రేడియో ఒక పడక్కుర్చీ పొంది, హాయిగా జీవించాలనేకునేవాణ్ణి.
దానికి మరి పెట్టి పుట్టాలి కదా.

అదృష్టముండాలి కదా.
కష్టేఫలి సూత్రం వినే వయస్సు లేదు. దాన్ని నమ్మి ఆచరించే వయస్సు అంతకన్నా కాదు.
ఈ నమ్మకం - అదృష్టమే.. జీవితంలోని ప్రతి మంచికి, సుఖానికి మూల కారణమనే నమ్మకం - 1968 నవంబర్ 2న అహ్మదాబాద్ చేరిన తర్వాత పదేళ్లలో పూర్తిగా మరుగున పడిపోయింది.
1968 లో గీరా బెన్ శరభాయ్‌ను కలిసాను.
1976లో ధీరూభాయ్ అంబానీనీ కలిసాను.

1968 నుంచి 1971 దాకా కష్టపడి పనిచేసి గీరా బెన్ నమ్మకాన్ని, అభిమానాన్ని పొంది 1972 లో అహ్మదాబాద్‌లో స్థాపించబడిన శిల్పీ అడ్వర్‌టైజింగ్‌లోకి మార్చబడ్డాను.
1972 నుంచి నేటి దాకా ఈ అడ్వర్‌టైజింగ్ రంగంతో తెగని బంధం నాది. ఈ రంగమే నాకు కూడు, గుడ్డ, ఇల్లు వాకిలీ, మొబైల్ అన్నీ సమకూర్చింది. ఎంతో ప్రియమైన రంగం నాకిది.
ఇన్నేళ్ల తర్వాత కూడా అంటే. 38 ఏళ్ల తర్వాత కూడా ఏదన్నా, మంచి యాడ్ సృష్టిలో భాగం పంచుకుంటే ఆనాడు పండగే.
ఎన్ని గంటలైనా పనిచేయగలను, నేటికి కూడా అలసిపోకుండా.

దీన్నే ఇష్టమైన పని కష్టం కాదనటం అంటే.
అయితే నా విషయంలో ఈ పనే నా కిష్టమైనదని 1972లో కాని తెలియలేదు. అంటే నా ముప్పయ్యో ఏట.
ఈ లోగా ఎన్ని ప్రయోగాలో, కూటి కోసం కోటి విద్యలంటారే.. అలాగా...
అయితే ఏదో ఒక రోజున మన కిష్టమైన పనేదో మనం గ్రహిస్తేనే, జీవితంలో ముందంజ..దానికో సార్థకత లభించేది...


-ఎజి కృష్ణమూర్తి

డబ్బే ముఖ్యం కాదు.. జయహో విజయగాధలు : పద్ధతులు - 3

ఇష్టమైన పని, అది ఎంత కష్టమైనా ఆనందంగా చేస్తాం...చేస్తూనే ఉంటాం...
ఉదాహరణగా, ప్రేయసి పార్కులో ఎదురు చూస్తుంది. బస్సు దొరకలేదు.ఆలస్యమవుతూంది.. మరో బస్సు వచ్చింది. జనంతో కిటకిటలాడుతూ ఉంది. ఫుట్ బోర్డు మీద వెళ్లాడ్తూ దుమ్ము ధూళి లెక్కచేయకుండా, సంతోషంగా ప్రయాణం చేసి ప్రియురాలిని చేరుకుంటాడు ప్రియుడు.
ఇంతకన్నా సాహసాలు చేసిన ఎంతో మంది ప్రేమికుల కథలు,గాధలు మనకు సుపరిచయాలే కదా !
ఇష్టమైన వ్యక్తి కోసం కష్టంలో కూడా సుఖమే దొరుకుతుంది.
అసలది కష్టమైతేనే కదా...
అదే మన ఫుట్ బోర్డ్ ప్రియుణ్ణి అలాగే ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లవయ్యా అంటే వెళ్తాడా? ఛాన్సేలేదు !!
నిదానంగా ఆఫీసు చేరుకొని ఎందుకు ఆలస్యమయిందయ్యా అంటే, బస్సు దొరక లేదంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇష్టమైన పనికి, లేని దానికి ఉన్న తేడా ఇది.
ముద్రాలో ట్రీసా అనే ఆవిడ నా సెక్రటరీగా చాలా కాలం పని చేసింది. ఆమెకి తన వృత్తి మీద అపారమైన ప్రేమ, గౌరవం. రాత్రిపూట, పెను తుపాను, నాలుగైదు అడుగుల ఎత్తుగా సిటీ అంతా నిలిచిన నీరు..ఇవేవి లెక్కచేయకుండా మా ఇంటికి వచ్చింది ఆ మర్నాడు ఉదయం నా ప్రయాణానికి అవసరమైన టిక్కెట్లు, ఆ మీటింగ్ కాగితాలతో.. తన వృత్తి మీద ఎంత ఇష్టం, గౌరవం లేకపోతే ఈ సాహసం చేయగలుగుతుంది ట్రీసా.
ఫలితంగా అటువంటి వారికి సంస్థలో గౌరవ మర్యాదలు అందరి కన్నా మిన్నగా జీతభత్యాలు లభించటం సహజమే కదా. విజేతలు అవలంబించే పద్దతుల్లో ఇదొకటి. ఎన్నుకున్న వృత్తిని ప్రేమించటం, అందులో ఉత్తములుగా ఎదగటం.
అందరికీ డబ్బు కావాలి !
అయితే డబ్బు ఉప ఉత్పాదన అన్న విషయం చాలా మందికి తెలియదు. నమ్మకంగా కష్టపడి పని చేస్తే పేరొస్తుంది. దాని ప్రతిఫలమే డబ్బు. ఇంత చిన్న సత్యం గ్రహించలేక డబ్బు కోసం వెంపర్లాడి, అది లభించక అశాంతికి గురైపోతాం లేదా అడ్డదార్లు వెతుక్కుంటాం.
మూర్ఖత్వం కాదా ?
గుజరాతీలకు వంశపారపర్యంగా అబ్బినది వ్యాపారంలోని మెళకువలు.. వ్యాపారం పట్ల మక్కువ. ఉద్యోగాలంటే అయిష్టం. వారికి వ్యాపారమంటే ఎంతో ఇష్టం.అందుకే తరాలు మారినా కుటుంబ వ్యాపారం అలా అలా సాగిపోతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది.
కనుకే వీరికి ఇష్టమైన పనేదో తెల్సుకోవటం, ఆ పనిని ఎంతో ఇష్టంగా చేయటం కష్టం కాదు.
మరి మనలాంటి వారి మాటేమిటి ?
తరతరాలుగా వ్యాపారాన్నే నమ్ముకున్న గుజరాతీయులు కాదు మనం. మన తల్లిదండ్రులు డాక్టర్లు, లాయర్లు కారు. మన కుటుంబానికంటూ ఎలాంటి వ్యాపారమూ లేదు. రాజకీయాల మీద వ్యామోహం లేదు మనకి.
మధ్యతరగతి లేక నిత్యం పోరాటం సాగిస్తున్న బీద కుటుంబాలో మనవి.
ఎలా మనకి ఏది ఇష్టమో తెల్సుకోవటం ? ఎలా ఆ తెల్సుకున్న రంగంలో నిష్ణాతులుగా మారటం ?
ఎలా విజేతగా రూపాంతరం చెందటం. ???
ప్రశ్నలు..ప్రశ్నలు.. ప్రశ్నలు...
సమాధానాలకు మూలకారణాలు ప్రశ్నలే కదా !
మీ ప్రస్థానం కూడా ప్రశ్నల నుంచే మొదలు కావాలి. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటూనే ఉండాలి. మీకు సమాధానం లభించేదాకా.
నా మొదటి ఉద్యోగం బాపట్ల కోర్టులో స్టెనో టైపిస్టుగా.
ఇంజనీరింగ్ చదవాలనే నా కోరిక ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులు రాక తీరని కోరికగానే మిగిలిపోయింది. 1956లో ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాను బాపట్లలో. 56 శాతం వచ్చినట్లు గుర్తు. పాలిటెక్నిక్‌కి ఆ మార్కులు సరిపోలేదు. డొనేషన్ రాజ్యం ఇంకా మొదలు కాలేదు. అందుకని తమిళనాడులో ఉంటున్న మా ఆమ్మ కొడుకు సహాయం అర్థించాం. ఆయన మంచి పొజిషన్‌లో, ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాడు. సరే, రమ్మన్నాడు మధురై. నేను, మా నాన్న గారు పెట్టే బేడాతో వెళ్లాం. నన్ను దింపి రెండ్రోజులుండి, మా నాన్న బాపట్ల తిరిగి వచ్చారు.

ఐదారు రోజుల తర్వాత తెల్సింది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇతర రాష్ట్రాల వారికి సీటు రావటం చాలా కష్టమని. అంతే తిరుగుటపాలో పెవిలియన్‌కి. బాపట్లకు చేరా.

తర్వాత తెల్సింది జీవితంలోని మంచి చెడ్డల గురించి సింహావలోకనం చేసుకుంటున్న సమయంలో. నాకే గనుక ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులు అంటే ఏ డెబ్బయ్యో, ఎనభైయ్యో వచ్చుంటే నాకు మన రాష్ట్రంలోనే ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజిలో ఇంజనీరింగ్ సీటు వచ్చి ఉండేదని. జీవితంలో మొదటి పాఠానికి పునాది పడింది ఆ రోజుల్లోనే..
చేస్తున్న పని ఏదైనా కష్టపడి ఆ పనిలో శ్రేష్టుడిగా నిలవాలని..
'విన్నర్ టేక్స్ ఆల్'- విజేతకే అన్నీ లాంటి లోకోక్తులతో తర్వాత పరిచయమైనప్పటికి, ఒక్కటి మాత్రం నిజం నాకు ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులొచ్చి ఉంటే, అప్పటి నా కల నెరవేరేదని.
మధురై నుంచి బాపట్ల తిరిగి వచ్చిన నన్ను చూసి మా కుటుంబమంతా షాక్ అయ్యారు. వారి దృష్టిలో నేను అక్కడ పాలిటెక్నిక్‌లో చేరిపొయ్యాననే. నిరాశ నిస్పృహలు మరుగున పడ్డాక కొన్నాళ్లు టీకాలు వేసే వేక్సినేటరుగా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత టైపు, షార్టు హ్యాండు క్లాసుల్లో చేరాను.

అప్పుడు నా వయసు 15
ఒక సంవత్సరంలోనే టైపు హయ్యరు, షార్టు హ్యాండు లోయర్ పాసయ్యాను.
బాపట్ల సబ్‌కోర్టులో లీవ్ వేకెన్సీలో రెండు మూడు నెలల కోసం స్టెనో టైపిస్ట్ ఉద్యోగం.
పదహారేళ్ల వయసు
పొట్టిగా ఉండేవాణ్ణి.
శాస్త్రిగారని అడిషనల్ సబ్ జడ్జిగారి దగ్గర ఉద్యోగం. స్ఫురద్రూపి, కంచు గంట లాంటి కంఠం.
ధారాళంగా ఇంగ్లీషులో డిక్టేషన్ ఇచ్చేవాడు పొద్దున్నే ఇంటికి పిలిచి. ఒక్క ముక్క కూడా అర్ధమయ్యేది కాదు. తప్పుల తడకలుగా టైపు చేసి ఇచ్చే వాణ్ణి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు.
ఒక రోజున కోర్టులోకి పిలిచాడు డిక్టేషన్‌కని. కోర్టులో కెళ్లే సిబ్బందీ అందరూ కోట్లు ధరించాలి. నాకు సొంత కోటు లేక మా అన్నయ్య కోటు వేసుకొని కోర్టుకెళ్తుండే వాడిని.
ఆ రోజున శాస్త్రిగారి మూడ్ బాగా లేదో, నా టైపింగ్ మరీ చంఢాలంగా ఉందో కాని, నిండు కోర్టులో ఎడాపెడా దులిపేశాడు. కోర్టులోనే ఏడ్చాను. నిజానికి నేటి క్కూడా- అంటే 52 ఏళ్ల తర్వాత కూడా ఆ కోర్టు సీను నా కళ్లకు కట్టినట్లుగా కనబడుతుంది.
నిండు కోర్టులో ఉగ్ర నరసింహ స్వామిలా జడ్జిగారు....వెక్కిళ్లు పెడ్తూ నేను.
ఆ నరకం తొందరగానే ముగిసింది. అది టెంపరరీ జాబ్ కనుక. అయితే ఆ దృశ్యం అలాగే నిలిచిపోయింది, నేను నా జీవితంలో ఎంతో తీవ్రంగా ద్వేషించే దృశ్యంగా.
ఆ తర్వాత మరికొన్ని టెంపరరీ జాబులు-కోర్టుల్లోనే.
1960లో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజీ ద్వారా నాకు ఇంటర్వ్యూ వచ్చి భారతీయ పురాతత్వ శాఖలో స్టెనో గ్రాఫర్‌గా పర్మనెంట్ ఉద్యోగం దొరికింది. అదీ గుంటూరులోనే.
జీవితం మరో మలుపు తిరిగింది. మరో ప్రయోగం మొదలైంది.
ఇన్నేళ్లు గడిచినా, ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులొచ్చి ఉంటే ఎంత బాగుడేంది కదా అనిపిస్తుంది !

-ఎజి కృష్ణమూర్తి