Pages

Thursday, December 16, 2010

నోబిస్ దాస్..రసగుల్లా

రుక్మిణీ దేవి అరండేల్ దక్షిణాదిలో సృష్టించిన చెన్నై కళాక్షేత్రం నుంచి తూర్పు దిశగా పయనించి నోరూరించే రసగుల్లాలు ఆస్వాదిద్దామా ? అయితే పదండి ఒడిషా వెళదాం. ఈ లోగా మరోసారి గుర్తు చేసుకుందామా.. భగవంతుడు మనకెలాంటి నైపుణ్యాన్ని ప్రసాదించాడన్నది కాదు ముఖ్యం, దాన్ని ఎంత తొందరగా, ఎంత బాగా గుర్తించి, వెలుగులోకి తీసుకువచ్చామన్నదే ప్రధానం.

భరత నాట్యం కావచ్చు.. రసగుల్లాలు కావచ్చు... వాషింగ్ పౌడర్ కావచ్చు....రస్నాలాంటి సాఫ్ట్ డ్రింక్ కాన్‌సంట్రేట్ కావచ్చు... లేక అప్పడాలు కావచ్చు. 'కవితకేది కాదు అనర్హం' అన్నట్లు పేరు ప్రఖ్యాతులు, ధనలక్ష్మీ కటాక్షం పొందటానికి అన్ని రంగాలు, అన్ని వృత్తులు, అందరూ అర్హులే. ఈ సత్యాన్ని విస్మరించి ఎక్కడో దేన్నో వెతుక్కుని తద్వారా గుర్తింపు పొంది విజేతగా రూపాంతరం చెందాలనుకోవటం చంకన పిల్లవాన్ని పెట్టుకుని ఊరంతా గాలించటమే అవుతుంది. మనలో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక నైపుణ్యాన్ని ప్రసాదించాడు. ముందు ఈ సత్యాన్ని గ్రహించటం ఎంతో అవసరం. ఆపైన దాన్ని గుర్తించి, ఆ రంగంలో శ్రమించి నిష్ణాతుడిగా మారటం ఇంకా ఎంతో అవసరం.

ఇక తిరుగేమిటి ? విజయ ప్రస్థానం వైపు దూసుకెళ్లటమే.. చంకలో పిల్లాడంటే గుర్తుకొచ్చింది ఈ చిన్న కథ. అనగనగా ఒక రోజున ఒక వ్యక్తి పేరు రాజయ్య అనుకుందాం. కాశీ యాత్రకు బయల్దేరాడు. ఆ రోజుల్లో నేటిలాగా క్షణాల్లో కాశీలో దించే విమానాలు లేవు కదా ! నడకే ఉన్న ఏకైక మార్గం...మూటా ముల్లే చంకలో వేసుకుని ప్రయాణిస్తున్నాడు. నేటిలాగా ఆ రోజుల్లో కూడా దొంగలకు కొదవలేదు. ఓ దొంగ... రాజయ్య మూటాముల్లే గమనించి తోటి కాశీ ప్రయాణికుడి లాగా పరిచయం చేసుకుని, ఆయనతో ప్రయాణం మొదలుపెట్టాడు.

అయితే ఆ దొంగ కళ్లన్నీ రాజయ్య ముల్లె మీదే... ఒక రాత్రి సత్రంలో బసచేశారు.. ఒకే గదిలో విశ్రమిస్తున్నారు. అర్థరాత్రి దాటాక రాజయ్య ధనాన్ని తస్కరిద్దామని గదంతా గాలించాడు దొంగ. ఎంత వెతికినా, ఎంత శ్రమపడ్డా ఆ డబ్బు మూట దొరకలేదు. విసుగు చెంది నిద్రపోయాడు దొంగ. మర్నాడు ఉదయం రాజయ్య నిద్రలేచాక అడిగాడు "నీ డబ్బు మూటని ఎక్కడ దాచావో కాని, గదంతా గాలించా ఎక్కడా దొరకలేదు... ఎక్కడ దాచావేంటి'' ?!!

"నీ వాలకాన్ని బట్టి నువ్వు దొంగవనే అనుకున్నాను..నువ్వెక్కడా చూడని చోటున నా డబ్బు మూట పెట్టానన్నాడు.'' అదే ఎక్కడ ?? "నీ తల దిండు కింద'' అన్నాడు రాజయ్య చిరునవ్వుతో..దీన్నే చంకలో పిల్లాణ్ణి పెట్టుకొని ఊరంతగా గాలించటమంటే. స్వతహాగా మనకు అబ్బిన నైపుణ్యాన్ని గుర్తించక, కొత్త నైపుణ్యాల కోసం వేటాడటం సమజంసమేనా ? నేను ప్రకటనా రంగంలో కాకుండా మరేదో రంగాన్ని వృత్తిగా ఎన్నుకుని ఉంటే ఏమై ఉండేదో అని తలచుకుంటేనే భయమేస్తుంది. అలాగే బిల్‌గేట్స్ సాఫ్ట్‌వేర్ కాకుండా ఏ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సో చేసుంటే ఏమై ఉండేదో కదా !

ఊహే భయంకరంగా లేదు ? సో, ఫ్రెండ్స్ మీలో అంతర్లీనమై ఉన్న మీ ప్రావీణ్యాన్ని వెలికి తీయండి. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు..ఆపలేరు. ఇక పదండి నోరూరించే రసగుల్లాల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. ఈ వ్యక్తి బిల్‌గేట్స్ లాంటి అసాధారణ సాంకేతిక ప్రతిభాశాలి కాకపోవచ్చు. కాని ప్రపంచం ఆయన చేతి మహత్తును రుచి చూస్తోంది. ఆయన చేస్తున్న రసగుల్లాలను అద్భుతంగా ఆహ్వానిస్తోంది.

ఇది నోబిన్ దాస్ స్ఫూర్తిదాయకమైన గాథ. ఆయన స్థాపించిన 'కెసి దాస్ అండ్ సన్స్' సంస్థ ప్రపంచవ్యాప్తంగా రసగుల్లా ప్రియుల పాలిట వరప్రసాదంగా మారిన వైనాన్ని నోరూరించేలా వివరించే కథనం... భువనేశ్వర్‌కి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో పహాలా అనే గ్రామంలో కాటేజ్ చీజ్ (పన్నీర్) పంచదార పాకాన్ని మేళవించి తయారు చేసే రసగుల్లా అనే సాంప్రదాయ వంటకం ఎక్కణ్ణుంచి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుంటే ఔరా అని విస్తుపోక మానరు.

రసగుల్లా ఎక్కువ కాలం నిల్వ ఉండదు.. త్వరగా పాడైపోతుంది. పుల్లగా మారిపోతుంది. ఎంత గొప్ప రిఫ్రిజిరేటర్‌లో దాచినా సరే రెండు రోజులకి మించి దాని రుచిని కాపాడటం కష్టం. నోబిన్ చంద్ర దాస్ నిరుపేద. తండ్రి లేడు. శిథిలావస్తలో ఉన్న మిఠాయి దుకాణాన్ని నెట్టుకొస్తూ తల్లినీ, తోబుట్టువులను పోషిస్తూ వచ్చాడు. నోబిన్ దాస్ వద్ద పెట్టుబడి లేకపోయినా, తన వ్యాపారానికి సంబంధించిన పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉంది. అందువల్లే బెంగాలీ వంటకాలు చేస్తూ బతుకు బండి లాగిస్తూ వచ్చాడాయన. లోలోపల మాత్రం ఏదో తపన. ప్రయోగాలు చెయ్యాలనీ, కొత్తదనాన్ని అన్వేషించాలనీ చాలా ఆరాటపడేవాడు. 1868లో ఓ రోజు నోబిన్ దాస్ జీవితాన్ని మలుపు తిప్పింది. వంటశాలలో ఆయన కొత్త దినుసులు రంగరించాడు. అంతవరకు అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు.

నోబిన్ దాస్ ప్రయోగాల ఫలితంగా రసగుల్లా జీవితకాలం పెరిగింది. రుచిని కోల్పోకుండా, ఎక్కువ రోజులు నిల్వచేయటం వీలైంది. ఆనాటి ప్రయోగం వ్యాపారపరంగా విజయవంతమై, నోబిన్ దాస్‌కి ధనలక్ష్మీ కటాక్షం కలిగించిందో లేదో కానీ, ఆయన కుమారుడు మాత్రం మరో ఆకు ఎక్కువే చదివాడు. తండ్రి కనిపెట్టిన సూత్రాన్ని వ్యాపార విజయంగా మలుచుకున్నాడు. రసగుల్లాలను డబ్బాల్లో ప్యాక్ చేసి, శరవేగంతో అమ్ముడయ్యేలా చేశాడు.

అంతే.. అన్నాళ్లు , ఒకటి రెండు రోజులకు పరిమతమై పోయిన రసగుల్లా అమృతంగా మారి మరో కొత్త జన్మ ఎత్తింది. తన జీవిత కాలంతో పాటు మార్కెట్ పరిధిని కూడా విస్తరించుకుంది. చిక్కటి పాకంలో పౌర్ణమి నాటి చందమామల్లా తేలుతూ దాస్ గారి దుకాణం నుంచి రసగుల్లాలు ఇతర ప్రాంతాలకు ఎగిరివెళ్లాయి. తీపి పదార్థ ప్రియులకు కొత్త లోకాన్ని పరిచయం చేసినాయి.

ఒకరోజు నోబిన్ చంద్రదాస్ చేసిన ప్రయోగం చూడండి. ఎంత గొప్ప వ్యాపార విజయానికి పునాదులు వేసిందో ?! నిజానికి నోబిన్ చంద్ర దాస్ మిఠాయి వంటలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రజ్ఞావంతుడేమి కాదు. అప్పట్లో ఒరియా, బెంగాలీ వంటకాల తయారీలో అనుసరించే పద్దతుల్నే అతడు అనుసరించేవాడు.

కానీ, ఒక్కటే తేడా ! తన రంగంలో నిష్ణాతుడిగా కావాలన్న తపన, పట్టుదలే నోబిన్‌దాస్‌ని ప్రయోగాల వైపు నడిపించింది. కేవలం ఒక్కరోజుకే పరిమితమైన రసగుల్లాని మరిన్ని రోజుల పాటు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న జిజ్ఞాస, తన జీవితాన్నే కాకుండా తన తర్వాత తరాల వారి జీవితాల్ని, రసగుల్లా చరిత్రను మార్చివేసింది.
- ఎజి కృష్ణమూర్తి

No comments:

Post a Comment