Pages

Friday, December 17, 2010

ఎ.జి.కె యాడ్‌ గైడ్

అడ్వర్‌టైజ్‌మెంట్ ఏం చేయాలి..? కంపెనీ బ్రాండ్‌ను పెంచాలి. ఉత్పత్తులు వేగంగా అమ్ముడుపోయేలా చేయాలి. ఈ రెండు పనులు చేయలేదంటే ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ ఫెయిల్ అయినట్లే కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రస్తుతం వస్తున్న ప్రకటనల్లో 85 శాతం ఫలితాలను ఇవ్వడం లేదు. కంపెనీలు కోట్లు కుమ్మరించి తీస్తున్న ప్రకటనలు వృథా అవుతున్నాయి. ఈ రంగాన్ని ఆషామాషీగా తీసుకుని పనిచేస్తున్న వాళ్లు ఎక్కువవ్వడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఇన్స్యూరెన్స్ కంపెనీలలాగే అడ్వర్‌టైజింగ్ రంగం కూడా అంతటి సీరియస్ వృత్తి. ఇందులో పనిచేసేవాళ్లు తాము అందరికంటే సృజనాత్మకశీలురమని భ్రమిస్తుంటారు. ప్రజల అభిరుచులు ఎలా మారిపోతున్నాయి..? ఏం కోరుకుంటున్నారు..? ఎవరి కొనుగోలు శక్తి ఎంత..? అనే విషయాలే పట్టడం లేదు ప్రకటనల రూపకర్తలకు.

వాగ్దానం+నాణ్యత

ఒక్కోసారి కొన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లు అసలుకే మోసం తెస్తాయి. కోకాకోలా కంపెనీ ఉత్పత్తిలో అదే జరిగింది. కోక్‌నే కొంచెం మార్చి 'న్యూ కోక్' అనే కొత్తరకం పానీయాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించారు. అయినా సరే, ఆ ఉత్పత్తి ఘోరంగా విఫలమైంది. మళ్లీ పాత కోక్‌నే ఉత్పత్తి చేయక తప్పలేదు. ప్రకటనలలో ఇచ్చే వాగ్దానానికి, నాణ్యతకు పొంతన కుదరకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. మన దేశంలో ప్రకటనల రంగం విలువ రూ.22 వేల కోట్లు.

దీనిలో ఎలక్ట్రానిక్ మీడియా వాటా 55 శాతంకాగా ప్రింట్ మీడియా 40 శాతం ఔట్‌డోర్ 3, రేడియో, ఇంటర్‌నెట్ కలిపి ఒక శాతం ఉంది. భవిష్యత్తులో మొబైల్ ప్రకటనలు కూడా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, ముంబయి, ఢిల్లీ, చెన్నైలలో ఈ రంగం ఎందుకు దూసుకెళుతోందంటే.. అక్కడ ఉత్పత్తిదారులు ఎక్కువమంది ఉన్నారు. మన రాష్ట్రంలో సేవలు మినహా, ఉత్పత్తి తక్కువ. అందుకే మన దగ్గర ప్రకటనల రంగం అభివృద్ధి కావడం లేదు. అయితే గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లో కూడా వస్తువినియోగం వేగవంతమవుతోంది. వినియోగదారుని మనస్తత్వం కూడా మారిపోతోంది.

కాని దీనికి తగ్గట్టు అడ్వర్‌టైజ్‌మెంట్లు మారడం లేదు. విమల్, రస్నా, నిర్మా కంపెనీల ప్రకటనలు గుర్తుండిపోయినట్లు.. ఇప్పుడొస్తున్న ప్రకటనలు గుర్తుండటం లేదు. బ్రాండ్ అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రకటనలు కూడా రావడం లేదు. ప్రజలను సమ్మోహితులను చేసి.. వినియోగదారులుగా మార్చగలిగే శక్తి కొన్ని ప్రకటనలకే ఉంది. నిజానికి ఇప్పుడు అన్ని ఉత్పత్తులలో నాణ్యత పెరిగింది. దానికి తోడు పోటీ ఎక్కువైంది. ఇలాంటి సమయంలో ప్రకటనలే కీలకపాత్ర పోషిస్తాయి. వినియోగదారుని మనసులోకి పరకాయప్రవేశం చేస్తేనే ప్రభావశీలమైన ప్రకటనలను తయారుచేయగలరు.

ఈ పుస్తకంలో..

మన దేశంలో ప్రకటనల రంగం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ఒకటి అనుభవజ్ఞుల పుస్తకాలు లేకపోవడం. ఈ కొరతను తీర్చేందుకే 'లర్నింగ్స్ ఆఫ్ యాన్ అడ్వర్‌టైజింగ్ ప్రాక్టీషనర్' పుస్తకం రాశాను. ఈ రంగంలో నాకున్న 30 ఏళ్ల అనుభవాలను ఈ పుస్తకంలో విశ్లేషించాను. కంపెనీ బ్రాండ్లకు ఎలా పేరు తేవాలి? వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు? ఉత్పత్తులను ఎంతవరకు ప్రజెంట్ చేయవచ్చు? ప్రకటనలరూపకర్తల ఆలోచనలకు ఎలాంటి హద్దులుండాలి? అనే విషయాలతోపాటు సుమారు ప్రకటనలరంగం మీద 20 అధ్యాయాలుగా విశ్లేషణలున్నాయి. ఈ పుస్తకం శనివారం హైదరాబాద్‌లోని క్రాస్‌వర్డ్ బుక్‌స్టోర్‌లో ఆవిష్కరించనున్నాం.

జూ ఆది మల్లెంపూటి

No comments:

Post a Comment